Wednesday, December 29, 2010

కాంగ్రెస్సే గెలిచింది !

kk-come
విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలన్న డిమాండ్‌తో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వ్యూహం ఫలించింది. రెండు రోజులుగా ఈ ఎంపీలు చేస్తున్న దీక్ష కార్యక్రమం అందరూ ఊహించినట్లుగానే సుఖాంతమైంది. ఇన్నాళ్ల పాటు మొత్తం కేసుల ఎత్తివేతకు న్యాయ పరమైన చిక్కులను సాకుగా చూపిన ప్రభుత్వమే నేడు వాటిని స్వయంగా తొలగించేందుకు సిద్దమైంది. ఈ కేసుల ఎత్తివేత క్రెడిట్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కాలన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరును పరిశీలిస్తే స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ సైతం అంగీకరిస్తోంది. తెలంగాణలో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకే అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ రకమైన పాచికలు వేసిందని తెలుస్తోంది. తెలంగాణ పేరుపై జరిగే ప్రతి కార్యక్రమంలోనే క్రెడిట్‌తనకే దక్కేలా కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది.

న్యాయపర చిక్కులు ఇప్పుడెలా వీడుతాయి?
రాష్ట్ర విభజన ఉద్యమంలో విద్యార్ధులపై నమోదుచేసిన కేసులను ఎత్తి వేయాలన్న డిమాండ్‌ న్యాయపరమైనది అని అన్ని రాజకీయ పార్టీలు భావిం చాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ఉభయ సభలలో ఈ అంశంపై అన్ని పార్టీలు ముక్త కంఠంతో కేసుల ఎత్తివేతకు డిమాం డ్‌ చేశాయి. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటూ మొత్తం కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. కొన్ని చిన్న చిన్న కేసులు మినహా సీరి యర్‌, వెరి సీరియస్‌ కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం వొక్కానించింది.

ఈ కేసులు ఎత్తివేతకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. ఈ కారణం చేత మొత్తం కేసులను ఎత్తివేయలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం కేసులు ఎత్తివేయాల్సిందేనని ప్రతిపక్షపార్టీలతోపాటు అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులంతా సభలో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై రెండున్నర రోజుల పాటు సభ కూడా స్థంబించింది. ఇంత చేసిన న్యాయపరమైన చిక్కులున్నాయని, మొత్తం కేసుల ఎత్తివేత సాధ్యంకాదని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కానీ ఈ సమావేశాలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగడంతో మొత్తం కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

న్యాయపరమైన సమస్యలను తెరపైకి తీసుకురాకుండానే అన్ని ఎత్తివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వెనక అసలు వ్యూహం ఏమిటో ఇట్టే తెలుస్తోంది. మొత్తం కేసుల ఎత్తివేతకు అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో కోరినా స్పందించని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వాటిపట్ల సానుకూలంగా స్పం దించడం వెనక వ్యూహం దాగివుందని ఇట్టే తెలుస్తోంది. నాడు ప్రభుత్వం ఈ వ్యవహారంలో స్పందించివుంటే అధికార కాంగ్రెస్‌కే కాకుండా క్రెడిట్‌ ప్రతి పక్షపార్టీలకు దక్కేది. ఈ కారణం చేతను అసెంబ్లీ సమావేశాలలో స్పందిం చకుండా సాగదీసి కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షలు చేశాక స్పందించడం క్రెడిట్‌ కోస మేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు ఎత్తివేస్తున్నప్పుడు క్రెడిట్‌ తమకు దక్కకపోతే ఎలా అని ఓ కాంగ్రెస్‌నేత వ్యాఖ్యనించడం గమనార్హం.

సొంత అజెండాతోనే?
తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలతో కలసి ఒకే అజెండాతో ముందుకెళ్తామని మొన్నటి వరకు చెప్పిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక అజెండాతో కదనరంగంలోకి దూకుతున్నారు. విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై స్వతంత్రంగానే దీక్షలోకి దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం భవిష్యత్తులోకూడా ఇదే ధోరణీతో వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ కేసులను మేమే ఎత్తివేయించామని చెప్పుకోవడంతోపాటు తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే అని చెప్పుకోనే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది, తెచ్చేది తాము అని చెప్పినందున ఈ విషయంలో తమపై బాధ్య మరింత పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారం ద్వారా తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్రను పోషించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం సిద్దమవుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌కు చెక్‌పెట్టి క్రెడిట్‌ను దక్కించుకొనే యత్నం సాగిస్తోంది. 

కాంగ్రెస్‌ ఎంపీల దీక్ష రాజకీయ డ్రామా : ఎర్రబెల్లి కేసులు ఎత్తివేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష అంతా రాజకీయ డ్రామా అని టీడీపీ నేత ఎర్రబెల్లి ఎద్దేవ చేశారు. కాంగ్రెస్‌తో కేసీఆర్‌ సైతం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని ఆయన విమర్శించారు. అక్రమ కేసులు పెట్టింది వాళ్లే, ఎత్తేసింది వాళ్లే... దీంట్లో కొత్త ఏముందని ప్రశ్నించారు. అసెంబ్లీని ఏడు రోజులు స్థంభింపజేశాం... పార్లమెంటును ఏనాడైనా స్థంభింపజేశారా? అని కాంగ్రెస్‌ ఎంపీలను ఆయన నిలదీశారు. చిత్తశుద్ది ఉంటే ఆమరణ దీక్ష చేయండని సవాల్‌ విసిరారు.

No comments: