Friday, December 17, 2010

ఆకాశం బద్దలుకొట్టయినా... తెలంగాణ సాధిస్తాం

గర్జించిన తెలంగాణ * ధక్కా పక్కాగా కొట్టాలె .. తెలంగాణ తేవాలె
భూకంపం పుట్టించైనా.. ఆకాశం బద్దలుకొట్టైనా తెలంగాణ సాధిద్దాం
రాజకీయ సంక్షోం సృష్టిద్దామంటే కాంగ్రెస్, టీడీపీలు నాటకాలాడాయి
ఆంధ్రా సీఎంలను చూస్తే వారికి లాగులు తడుస్తాయి
బ్రేకులు బద్దలు కొట్టేదే వరంగల్ సభ
కేసీఆర్ వ్యాఖ్యలు
బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలి
మహాగర్జన సభ తీర్మానం
 రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహాగర్జన సభ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఈ సభలో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు.. గతేడాది డిసెంబర్‌లో ప్రకటన చేసినట్లుగా తెలంగాణ ఇవ్వకపోతే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మలివిడత ఉద్యమాన్ని వచ్చే జనవరి నుంచి గాంధేయ మార్గంలో సత్యాగ్రహంతో మొదలుపెడతామన్నారు.

కేంద్రం దిగిరాకపోతే అది పెను ఆగ్రహంగా, మహోగ్రంగా మారుతుందని ప్రకటించారు. ఇందుకు వరంగల్ గర్జన సభే సంకేతమన్నారు. తెలంగాణకు బ్రేకులు బద్దలు కొట్టేదే వరంగల్ సభని చెప్పారు. వరంగల్ నగరంలోని ప్రకాశ్‌రెరెడ్డిపేటలో గురువారం జరిగిన మహాగర్జనలో కేసీఆర్ మరోసారి కేంద్ర, రాష్ట్ర పాలకులపై తీవ్రస్థాయిలో గర్జించారు. సభకు విచ్చేసిన జనసంద్రాన్ని చూసైనా యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టడానికి వెనుకాడవద్దన్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకోకుంటే వారి ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందన్నారు. గత పదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఘనత ప్రజలదేనని కేసీఆర్ ఉద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణలోని ఊర్లన్నీ ఉద్యమాలుగా మారాయని, విద్యాసంస్థలు యుద్ధ భూములయ్యాయని చెప్పారు.

దీంతో దిగివచ్చిన ఢిల్లీ.. తెలంగాణ ఇస్తానని ప్రకటించిందని అన్నారు. తెలంగాణ రాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డంకులు సృష్టించారని కేసీఆర్ మండిపడ్డారు.ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణను ఒక్కటి చేయడానికి 54ఏళ్లు పడితే, దీన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు గంటలో ఒకటయ్యారని అన్నారు. చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి.. ఆంధ్రా జీవులు ఒక్కటై డబ్బులిచ్చి ఆందోళనలు చేయించారని ఆరోపించారు.

వాళ్లు దద్దమ్మలే

కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. జేఏసీలో చేరిన కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు.. తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి, తర్వాత వెనక్కి తగ్గితే దద్దమ్మలు అనక ఏమనాలి? అని ప్రశ్నించారు. "వీరిలో కనీసం 25 మంది రాజీనామా చేసినా ఈ పాటికి ప్రత్యేక తెలంగాణ వచ్చేది. వెన్నెముకలేని, ఈ దద్దమ్మల వల్లనే రాకుండా పోయింది.

1956లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ఊడగొట్టింది ఈ కాంగ్రెస్ దద్దమ్మలే. ఇప్పుడు ఉద్యమాన్ని పోగొట్టిందీ వీరే. ఆంధ్రా సీఎంలను చూస్తే వీరికి లాగులు తడుస్తాయి'' అని కేసీఆర్ ధ్వజమెత్తారు. "హైదరాబాద్‌ను ఫ్రీజోన్ అంటే పట్టించుకోరు. ఆంధ్ర ప్రాంతంలో అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే గుడ్లప్పగించి చూస్తారు. విద్యార్థులపై కేసులు పెడితే పట్టించుకోరు'' అని మండిపడ్డారు.

కేసులు ఎత్తివేయమని తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుబడితే వారినే బయటకు ఎత్తేశారని చెప్పారు. "ఆంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి హైకమాండ్‌ను ధిక్కరించి ఇటు కాంగ్రెస్‌లో ఉంటూనే అటు జగన్ వెంట నడుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి భయపడుతున్నారు. వారికిలేని హైకమాండ్ వీరికెందుకు?'' అని కేసీఆర్ నిలదీశారు.

గవర్నర్‌కు అంత వెటకారం తగదు
శ్రీకృష్ణకమిటీ నివేదిక నేపథ్యంగా డిసెంబర్ 31 తర్వాత ఏం జరుగుతుందంటే 'జనవరి 1 వస్తుంది' అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అపహాస్యం చేయడాన్ని కేసీఆర్ ఖండించారు. వెటకారంగా మాట్లాడటం గవర్నర్ హోదాకు తగదన్నారు. మరోవైపు డీజీపీ అరవిందరావు డిసెంబర్ 31 తర్వాత అదనపు బలగాలు వస్తున్నాయని ప్రకటిస్తున్నారని చెప్పారు.

నిజానికి రావలసింది అదనపు బలగాలు కాదు తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను ఇట్లాంటి సభల ద్వారా వ్యక్తం చేసినప్పుడు ఢిల్లీ పెద్దలకు వాస్తవిక నివేదికలు ఫోటోలతో సహా పంపితే తప్పనిసరిగా తెలంగాణ వస్తుందని చెప్పారు. అటువంటి ప్రయత్నాలు వదలిపెట్టి, లాఠీలకు, తూటాలకు డీజీపీ పని చెప్పారని అన్నారు. తూటాలకు, లాఠీలకు భయపడే స్థితిలో కేసీఆర్‌గానీ, తెలంగాణ ప్రజలు గానీ లేరని స్పష్టం చేశారు.

వాళ్లు బిచ్చగాళ్లు
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తేకుండా మంత్రి పదవుల కోసం చిప్పలు పట్టుకొని బిచ్చగాళ్లలా తిరుగుతున్నారని చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చే విషయంలో ఈ ప్రాంత ప్రజల ఓపికను, సహనాన్ని ప్రధాని ఇంకా పరీక్షించవద్దన్నారు.

"జరుగుతున్న పరిణామాలను చూసి తెలంగాణ వాదులు కూడా గాలిగాబరా కాకుండా ఔరేక్ ధక్కాను పక్కాగా కొట్టాలే. తెలంగాణ తెచ్చుకోవాలె'' అని పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గర్జన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేయడం ద్వారా కేంద్రానికి కేసీఆర్ మార్చి వరకూ గడువు ఇచ్చినట్లయింది. అంటే.. డిసెంబర్ 31 తర్వాత అనూహ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సభ విజయవంతం
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తున్న తరుణంలో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో ఓరుగల్లు వేదికగా టీఆర్ఎస్ బల ప్రదర్శన చేసింది. టీఆర్ఎస్ 2003లో ఇక్కడ పెద్ద ఎత్తున సభ జరిపింది. 2004 ఎన్నికలకు ముందు రాజకీయంగా తన సత్తా చాటింది. అనంతరమే టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వచ్చింది.

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు లేనప్పటికీ 2జీ స్పెక్ట్రం కుంభకోణంతో యూపీఏ సర్కారు సతమతమవుతుండడం.. రాష్ట్రంలో జగన్ రగడ వ్యవహారం.. వెరసి మధ్యంతర ఎన్నికలు తప్పవనే ప్రచారం మధ్య టీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్ తెలంగాణ మహాగర్జన సభ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మహాగర్జన సభలోనూ గాంధీ మార్గంవైపే కేసీఆర్ మొగ్గు చూపారు.

అంతే కాకుండా పార్టీ తరపున ప్రత్యేకంగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించలేదు. ఈ సభకు ఆహ్వానించిన ప్రజా సంఘాలు భాగస్వాములుగా ఉన్న తెలంగాణ జేఏసీ.. ఇకపై చేపట్టబోయే ఉద్యమాన్ని నిర్దేశిస్తుందని చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇటీవలి కాలంలో వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ద్వంద్వ విధనాలు అవలంభిస్తున్నారంటూ నిప్పులు చెరిగిన కేసీఆర్.. వరంగల్ సభలో మాత్రం చంద్రబాబు ప్రస్తావన ఎక్కువగా తీసుకురాలేదు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలపై చవటలు, దద్దమ్మలు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘హోరు’ గల్లు గర్జన
వరంగల్‌ శ్రీకాంతాచారి ప్రాంగణంలో గురువారం జరిగిన మహాగర్జనలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు దాదాపు అరగంట సేపు మాట్లాడారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది... దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగనంతటి అతిపెద్ద సభ ఇది. ఒక సభకు ఇంతమంది జనం రావడాన్ని తన జీవితంలోనే చూడలేదని, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సభ అని స్వామి అగ్నివేశ్‌ చెప్పారు. ఈ జనాన్ని చూస్తే సమ్మక్క -సారలక్క శౌర్యమా, వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి సాహసమా అనిపిస్తోంది. ఇంటికొకరు రావాలని నేనిచ్చిన పిలుపునకు స్పందించి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీకందరికీ నా అభివందనాలు.

wgl
ఇక ఉద్యమం విషయానికి వస్తే 2001 జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ రోజులు ఎలాంటివంటే... హైదరా బాద్‌లో బస్సెక్కితే ఇంటికి చేరేలోగా మనిషి మాయమైపోతున్న రోజులు. అలాంటి పాలకుల పాలన కాలంలో ఈ ఉద్యమం పుట్టింది. కేవలం పిడికెడు మందితో ఈ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ పది సంవత్సరాల కాలంలో ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను, అటంకాల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొంది. ఉద్యమాన్ని అడ్డుకోడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.

కానీ ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, అడ్డుకున్నా కేసీఆర్‌ భయపడలేదు. వెనకడుగు వేయలేదు. మందుకు సాగాడు. ఇది నా గొప్ప కాదు. ఇదంతా మీ ఘనత. నేను నిరాహార దీక్ష చేస్తే మా వాళ్లు - ‘అన్నా! మాకు నీ ప్రాణాలు ముఖ్యం. జాగ్రత్తన్నా’ అని ఆప్యాయంగా భుజం తట్టారు. వద్దని వారించారు. కానీ నేనాడు చెప్పాను...తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ చచ్చుడో అన్నాను.
కిందటి ఏడాది నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 23 వరకు జరిగిందంతా చాలా కీలకం. తెలంగాణపై ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు గురించి పరిశీలిస్తామని పార్లమెంటులో ప్రకటించింది. కేంద్రహోంమంత్రి చిదంబరం తెలంగాణ గురించి ప్రకటన చేశారు. 54 ఏళ్ల తెలంగాణ పోరాట చరిత్రలో ఆ ప్రకటన ముఖ్యమైంది. నిరాహార దీక్షతో సాధించిన విజయమది.

wgl-sabaతెలంగాణా వాళ్లను, నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ వాళ్లను ఒక్కటిగా చేయడానికి ఇక్కడ 54 ఏళ్లు పట్టింది. అదే ఆంధ్రా నాయకులు షేక్‌హ్యాండు లిచ్చుకొని గంటలో ఒక్కటయ్యారు. చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి, ఆంధ్రా జీవులందరూ డబ్బు సంచులతో వచ్చి ఒక్కటై పోయారు. ఆంధ్ర నాయకులు ఒక్కటై పోయినా, ఆంధ్ర ఉద్యమానికి ఒక్క పాట లేదు. తెలంగాణ ఉద్యమానికి ఎన్ని పాటలొచ్చాయో అందరికీ తెలుసు. కానీ ఆంధ్రావాళ్ల ఉద్యమానికి పాటలేక, సినిమాపాటలేసుకున్నారు. ఇప్పుడు ఈ వరం గల్‌ సభతో తెలంగాణ ఉద్యమానికి ఒక బ్రేక్‌ వచ్చింది.

నిరాహార దీక్ష వల్ల కిందటి సంవత్సరం డిసెంబర్‌ 23 వరకు నా ఆరోగ్యం కుదుట పడలేదు. అయినా సరే అం దరం రాజీనామాలు చేద్దామనుకొని కాంగ్రెస్‌ నాయకుల చేత కూడా చేయిద్దామని వాళ్ల దగ్గరికి వెళ్లాం. కాంగ్రెస్‌ నాయకులకు తెలంగాణ అవసరం గురించి చెప్పాం. టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలం రాజీనామాలు చేశామన్నాం. రాజ కీయ సంక్షోభం పుట్టించాం.

kcr-vijaya తెలంగాణకోసం పదవులకు రాజీనామాలు చేయమన్నాం. మొదట 25 మంది రాజీనామా చేస్తామన్నారు. కానీ 12 మందే రాజీనామా చేశారు. రాజీనామా చేయని కాంగ్రెస్‌ చవట దద్దమ్మల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. 1956లో విడిగా ఉన్న తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే శారు. ఆనాడు ఈ చవట దద్దమ్మలే ఊడగొట్టిండ్రు. ఇప్పుడు తెచ్చుకున్నదాన్ని పొగొట్టారు. ఇది సభ కాదు, సముద్రం. తెలంగాణ కోసం ఇప్పుడు ఊళ్లన్నీ ఉద్యమ వేదికలయ్యాయి. ప్రతి ఊళ్లో తెలంగాణ రావడానికి ఉద్యమిస్తున్నారు.

ఊళ్లో వాళ్లందరూ కథానాయకులవుతున్నారు. వారంతా కలిసి తుపాను తెస్తే తప్ప కాంగ్రెస్‌ వాళ్లు మాట్లాడరు.తెలంగాణకోసం ఉద్యమం చేస్తే విద్యార్థులపై కేసులు పెట్టిండ్రు. ఒకటా, రెండా....ఒక్కొక్క విద్యార్థి మీదా 100 -150 కేసులు పెట్టారు. కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెడితే గుద్దులు గుద్ది బయటికి నెట్టేశారు. తెలంగాణ వాళ్లు ఏకం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అదే కాంగ్రెస్‌ వాళ్లంతా గంటలో ఏకమయ్యారు. అసలు, ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకులకు లేని హైకమాండ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు ఉంటుందా?

olddతెలంగాణ గురించి రాష్ట్ర గవర్నర్‌ వెటకారం చేస్తూ మాట్లాడారు. డిసెంబర్‌ 31న ఏం కాదు. 31 తర్వాత జనవరి 1 వస్తుంది అని గవర్నర్‌ ఎగతాళి చేశా రు. ఆయన మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఈ సభపై, తెలంగాణ ఉద్యమంపై ప్రయోగించడానికి అదనపు పారామిలిటరీ దళాల్ని తెప్పిస్తామన్నారు. ఈ సభకు ఎంత భారీగా జనంవచ్చారో ఢిల్లీకి రిపోర్టిచ్చి తెలంగాణ తేవాలి కానీ, అదనపు బలగాలు ఎందుకు? తూటాలకు, తుపాకులకు, లాఠీలకు భయపడేవారు ఇక్కడ లేరు. ఈ సభను, ఇంత బ్రహ్మాండంగా జరిగిన సభను చూసైనా కాంగ్రెస్‌ నాయకులు రాజీనామాలు చేస్తారా? చేయరు. మంత్రి పదవులకోసం బిచ్చగాళ్లలా తిరుగుతున్నారు.

danoraమా సహనానికీ ఒక హద్దుంది. లిమిట్‌ ఉంది. దాన్ని దాటనివ్వద్దు. దాటితే బాగుండదు. తెలంగాణాలో అన్ని సంఘాలవారూ ఈ సమావేశానికి హాజర య్యారు. అన్ని సంఘాలూ వేదికమీద ఉన్నాయి. తెలంగాణకోసం పిడికిలెత్తి ఉన్నారు. వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి. పార్లమెంటులో తెలంగాణ బిల్లు తెచ్చేవరకూ ముందుకే వెళ్లాలి. మొండిగా ఉండాలి. భయపడొద్దు. నామీద ఎన్ని చేశారు? ఎంతగా బెదిరించారు. ఎంతగా భయపెట్టారు? అడ్డుకున్నారు? అయినా నేను భయపడ్డానా? రాజీపడ్డానా? అట్ల ఉండబట్టే ఉద్యమాన్ని నడిపాం. ఉద్యమాన్ని కాపాడుకున్నాం. కీలెరిగి వాత బెట్టాలె. డక్క కొడితే పక్కాగా కొట్టాలి.

పోరుఘల్లు.. !
crowdd

'గులాబీల హోరు'గల్లు
జనసంద్రమైన మహాగర్జన

లక్షలాదిమంది హాజరు

కిక్కిరిసిన వెయ్యి ఎకరాల ప్రాంగణం
సగం మంది రోడ్లమీదే
20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
వరంగల్ నగరం జనసంద్రమైంది. తెలంగాణ మహా గర్జనకు తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలతో హోరెత్తిపోయింది. టీఆర్ఎస్ నేతలు, తెలంగాణవాదులతో లాడ్జీలు, హోటళ్లు కిటకిటలాడాయి. అర్ధరాత్రి వరకు నగరంలో సందడి కనిపించింది. మహాగర్జన బ్యానర్లు, నేతల కటౌట్లతో ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ జంక్షన్, కాళోజీ జంక్షన్, అమరవీరుల స్థూపం జంక్షన్, ఫాతిమానగర్ జంక్షన్‌లు గులాబీమయమయ్యాయి.

మహాగర్జన ప్రాంగణం జనంతో పోటెత్తింది. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. కళాకారుల ఆట, పాటతో కదం తొక్కింది. ట్రాఫిక్ రద్దీ కారణం ఆ సభాస్థలికి చేరుకోలేక సగంమంది రోడ్లపైనే నిలిచిపోయారు. జిల్లా నలుదిక్కుల నుంచి డప్పు చప్పుళ్లు, ర్యాలీలు, ఊరేగింపులతో వస్తున్న జనంతో నగరం కిక్కిరిసిపోయింది. ప్రధాన రహదారులన్నీ జన ప్రవాహాలయ్యాయి. ఎటుచూసినా జనమే.

మధ్యాహ్నం 12 గంటల నుంచే జనం చేరుకోవడం ప్రారంభమైంది. సుమారు వెయ్యి ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన గర్జన సభా ప్రాంగణం నిండిపోయింది. ఒకపక్క సభ జరుగుతున్నా జనం ఇంకా వస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా హైదరాబాద్-వరంగల్, వరంగల్- ఖమ్మం, వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారులపై వాహనాలన్నీ 20 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయాయి.

దీంతో, ప్రజలు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు. గర్జన సభకు దాదాపు 25 లక్షలమంది హాజరయ్యారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కళాకారుల పాటలు సభికులను ఊపేశాయి. ఉద్వేగానికి లోనుచేశాయి. సభ వరకు వెళ్లినా అక్కడ నిలబడేందుకు స్థలం లేకపోవడంతో వేలాదిగా వెనుదిరిగారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం
మహా గర్జన సభలో ఓ యువకుడు నిప్పంటించుకొని జనంలోంచి పరుగులు తీసిన దృశ్యం కలకలం సృష్టించింది. కేసీఆర్ ప్రసంగం ప్రారంభం కావడానికి కొద్దిసేపటికి ముందు.. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం మదనగిరిగూడెం గ్రామానికి చెందిన నందిగామ అంజయ్య (30) తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని జనం వైపు పరుగులు తీశాడు. చుట్టుపక్కలవారు దుప్పట్లు కప్పి మంటలను చల్లార్చారు. ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి ఆవేదన చెంది తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అంజయ్య చెబుతున్నాడు.
click here
వరంగల్‌ మహా గర్జన ముగిసింది. ఓరుగల్లు జనంతో హోరు మంది. 
తెలంగాణ కళాకారుల ఆట పాటతో ఘల్లు ఘల్లు మంది. మొత్తంగా హోరుఘల్లే అయింది. లక్షలాది తెలంగాణ అభిమానులతో వరంగల్లు పట్టణం కిటకిటలాడింది. వరంగల్లు నుంచి హైదరాబాదు, కరీంనగర్‌ వెళ్లే రోడ్లు, వరంగల్లు-కరీంనగర్‌ రోడ్డు, ఖమ్మం రోడ్డు 15 కిమీ మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. డిసెంబరు 31 లోగా శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో కేసీఆర్‌ తెలంగాణా శ్రేణులను సమాయత్తపరిచే వ్యూహంలో భాగంగా ఈ భారీ బహిరంగ సభకు రూపకల్పన చేశారు.

ఆ వ్యూహంలో కేసీఆర్‌ సఫలీకృతులయ్యారు. భారీగా హాజరైన జన సందోహం నుంచి అంతే భారీ స్దాయిలో స్పందనను ఆయన రాబట్టగలిగారు. స్వామి అగ్నివేష్‌ ఈ సభకు ఒక ప్రత్యేక ఆకర్షణ కాగా కేసీఆర్‌ కుమార్తె కవిత వేదిక మీద ప్రత్యక్షం కావడం మరో విశేషం. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణా బిల్లు పెట్టాల్సిందిగా కోరుతూ ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా కేంద్రానికి తుది అల్టిమేటం ఇచ్చారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వచ్చీరాగానే..దాని రూపు రేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా ఉద్యమ బాటలో ఎటు ఎలా నడవాలో పాలుపోని స్ధితిలో పడకుండా కొంత సమయం తీసుకుని నింపాదిగా ఆలోచించుకునేందుకు కేసీఆర్‌కు, ఆయన పార్టీకి ఈ తీర్మానం వెసులుబాటు కల్పిస్తుంది.

telagnaaf కేసీఆర్‌ ఈ కీలక తరుణంలో ఉద్వేగపూరిత ఉద్యమ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణా వాదులు భావించారు. ఒక వంక డిసెంబరు 31 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని అందరూ భావిస్తున్న తరుణంలో కేసీఆర్‌ అలాంటి ఉద్వేగభరిత వ్యూహాలకు పోకుండా తెలంగాణా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి అందరికీ ఊరట నిచ్చారు. అలాగని నివేదిక ఎలా ఉన్నా ఆయన కిమ్మని ఊరుకుంటారని అనుకోనక్కర్లేదు. నివేదిక తెలంగాణాకు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఉద్యమాన్ని ఉధృతం చేసే సదవకాశం ఆయనకు ఎప్పుడూ ఉంది.

అందుకే జేఏసీ నాయకుడు కోదండరామ్‌ కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తారని కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. తెలంగాణా కాంగ్రెస్‌ వాదులను, తెలుగుదేశం తెలంగాణా నేతలను తెలంగాణా ద్రోహులుగా జనంలో మరింతగా పాతుకుపోయేలా చేసే ప్రయత్నాన్ని అటు కేసీఆర్‌, ఇటు జయ శంకర్‌ తమ ప్రసంగాల ద్వారా చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం కన్నా తెలంగాణా కాంగ్రెస్‌ వాదుల మీద, తెలంగాణా తెలుగుదేశం నేతలపైనే వారు వాగ్బాణాలు సంధించారు. కేసీఆర్‌ అటు గవర్నరుని, ఇటు డీజీపీని కూడా వదల్లేదు. చంద్రబాబు రాజకీయాన్ని నిశితంగా విమర్శించారు. కేసీఆర్‌ ప్రసంగంలో సహజంగా ఉండే వాడి, వేడి, వ్యంగ్యం, చమత్కారం ఈసారి కొద్దిగా లోపించాయి.

దేశపతి శ్రీనివాస్‌ పాటలు మధ్యలో రసరంజకంగా ప్రేక్షకులను అలరించాయి. జై బోలో తెలంగాణా సినిమాకు కేసీఆర్‌ ఒక పాట రాశారన్న విషయం దేశపతి ద్వారా జనానికి తెలిసింది. ఆ పాటను కూడా ఆయన పాడి వినిపించారు. వేదిక మీద కేసీఆర్‌ పక్కనే విజయశాంతికి చోటు దొరికినా, మాట్లాడేందుకు ఆమెకు అవకాశం లభించలేదు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రసంగంతో మొదలైన మహా గర్జన రెండున్నర గంటల పాటు సాగింది. ఉదయం నుంచే ఆ ప్రాంతమంతా తెలంగాణా ఆటపాటలతో హోరెత్తింది. ప్రసంగాలు కొనసాగినంతసేపు జనం తెలంగాణా కేరింతలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

శ్రీకాకుళంలో పుట్టినా .. తెలంగాణకు మద్దతు ఇస్తున్నా
wgl-ssnమహాగర్జనకు ఆకర్షణగా నిలిచిన ప్రపంచ ఆర్య సమాజ్‌ వాది, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌ ప్రసంగం కూడా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ఆలోచింపజేసే విధంగా సాగింది. తానుపుట్టింది శ్రీకా కుళం అని, అయినా న్యాయమైన డిమాండ్‌ కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డానని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు చీకటి రాత్రులు అంతమయ్యే రోజు లు దగ్గరపడ్డాయని, విజయానికి చేరువగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపి అధినేతలపై దుమ్మెత్తిపోయడమే కాకుండా, అవినీతి అంతమయ్యేలా తెలంగాణ ఏర్పడిన వెంటనే లోకాయుక్తను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. చాకలివాడి గాడిద కథను ఉదహరిస్తూ ద్వంద విధానాలను అవలంభిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ ప్రజలది.. న్యాయ పోరాటం
సీమాంద్రుడినైనా న్యాయం పక్షాన నిలిచా..

శ్రీకృష్ణ నివేదికతో సంబంధం లేదు..
స్వామి అగ్నివేశ్ ఉద్ఘాటన
 యాభై ఏళ్లుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలది న్యాయమైన పోరాటమని ప్రపంచ ఆర్యసమాజం అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ స్పష్టం చేశారు. తాను న్యాయం వైపు నిలిచి పోరాడతానని చెప్పారు. గురువారం వరంగల్‌లో టీఆర్ఎస్ మహాగర్జనకు హాజరయ్యేందుకు ఆయన జేఎన్ స్టేడియంలో హెలికాప్టర్‌లో దిగారు.

అక్కడే విలేకరులతోనూ, తరువాత బహిరంగసభలోనూ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు గత ఏడాది డిసెంబర్ 9నే జరిగిపోయిందన్నారు. ప్రకటించిన తెలంగాణను పరిరక్షించుకోవడమే తక్షణ కర్తవ్యమని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ మహాగర్జన ద్వారా 25 లక్షల మంది గొంతెత్తి ఢిల్లీకి చాటేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ మావోయిస్టులు చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వడం సరైంది కాదని చెప్పారు.

తాను మావోయిస్టులతో మాట్లాడానని, ప్రభుత్వ వైఖరి వల్లే తుపాకులు పట్టామని చెప్పారన్నారు. గిరిజనులను ఇబ్బందులు పెట్టకుండా, వారి హక్కులకు భంగం కలిగించకుండా అటవీ ప్రాంతాలను ప్రభుత్వం కాపాడితే సమస్య ఉండదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గనులు, మద్యం మాఫియాల భయముండదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక న్యాయమైన డిమాండ్ అని.. అందుకే తాను సీమాంధ్రుడినైనా న్యాయం పక్షాన నిలిచానని వెల్లడించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేదని, తెలంగాణ సాధనే లక్ష్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల నీతి చెల్లబోదన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అర్ధరాత్రి పెట్టుబడిదారులు రంగంలోకి దిగి తెలంగాణ ప్రజల కలలను కల్లలు చేశారన్నారు. ఇందులో బాబు ముఖ్య పాత్ర పోషించారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మైనింగ్, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందని, ఈ శక్తులకు తెలంగాణలో చోటివ్వకూడదని సూచించారు. కేంద్ర పాలన పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలు బిచ్చగాళ్లు: జయశంకర్

తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే వెనక్కు తగ్గిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల కోసం బిచ్చగాళ్లయ్యారని ప్రొఫెసర్ జయశంకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే మీరే రాజ్యమేలవచ్చని కాంగ్రెస్ నేతలకు ఎంత చెప్పినా పదవులపై వ్యామోహంతో ఉద్యమానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. పాలకులుగా ఉండమంటే బానిసలుగా ఉంటామంటున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ టీడీపీ నేతలు కూడా బిచ్చగాళ్లే అయ్యారన్నారు.

వారు బతికున్న శవాలే: కోదండరాం
డిసెంబర్ తర్వాత చేపట్టే ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు కలిసి రాకుంటే బతికున్న శవాలుగానే ప్రజలు పరిగణిస్తారని ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీతో సంబంధం లేదని, జనవరి తొలి వారంలో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

కురుక్షేత్రం తప్పదు : పిడమర్తి రవి
డిసెంబర్ 31లోగా తెలంగాణ ప్రకటించకుంటే ఇప్పటి వరకు అనుసరిస్తున్న గాంధీ మార్గాన్ని వీడి, గాడ్సే మార్గాన్ని ఎంచుకుంటామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి స్పష్టం చేశారు. కేసీఆర్‌ది ప్రజాస్వామిక రాజకీయ పోరాటమైతే, విద్యార్థులు రాళ్లతో పోరాడతారన్నారు.

తెలంగాణ బాటలోనే ముస్లింలు: మైనార్టీ నేతలు
ముస్లింలు తెలంగాణకు వ్యతిరేకమని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమ బాటలోనే ముస్లింలు సాగుతారని మైనార్టీ నాయకులు మొహసీన్‌ఖాన్, మహబూబ్ అలం ఖాన్, మౌలానా యూసుఫ్ జాహీద్ స్పష్టం చేశారు.

సహాయ నిరాకరణ : స్వామిగౌడ్

తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయకుంటే డిసెంబర్ తర్వాత తెలంగాణలోని 2.5 లక్షల ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్ హెచ్చరించారు. ఇందుకు ఉద్యోగులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
click here యాచకుల్లా వ్యవహరిస్తున్న తెలంగాణ మంత్రులు
personపదవుల కోసం ప్రాకులాడకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై శాసకులుగా బ్రతకాలని తెలంగాణ ప్రాంత మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌లో నిర్వహించిన మహాగర్జన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత ఆంధ్ర కాంగ్రెస్‌, టిడిపి పార్టీ నాయకుల లాబియింగ్‌ వల్ల ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనకకు తీసుకొని శ్రీకృష్ణ కమిటీ వేసింది. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్‌, టిడిపి ప్రజా ప్రతినిధులు అధిష్టానం దగ్గర మంత్రి పదవుల కోసం యాచించకుండా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పర్చుకొని శాసకులుగా బ్రతకాలని పేర్కొన్నారు.

జనవరి నుంచి సహాయ నిరాకరణ
Kodandaramతెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని గాంధేయ మార్గం ద్వారా సాధించుకుంటామని తెలంగాణ జేఏసీ నాయకులు ప్రోఫెసర్‌ కోదండరాం అన్నారు. గురువారం వరంగల్‌ జిల్లా ప్రకాష్‌రెడ్డి పేటలో మహాగర్జన సభ జరిగింది. అందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలకుల నుండి గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చారని ఆయన గుర్తు చేశారు. డిసెంబర్‌ 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోతే జనవరి 1 నుండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ మార్గం ద్వారా చేపడుతామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళికలను అన్ని పార్టీల నాయకులు, విద్యార్థులు, ఉద్యమకారులతో ప్రణాళికలను రూపొదిందిస్తున్నామన్నారు.

పెన్‌డౌన్‌ సమ్మెకు సమ్మెకు ఉద్యోగులు సిద్ధం
మహాగర్జన సభతో కేంద్ర ప్రభుత్వం సత్వరమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని లేనిచో తెలంగాణాలోని రెండు లక్షల 50వేల మంది ఉద్యోగులందరు పెన్‌డౌన్‌ చేయడానికి సిద్ధమేనని తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ స్వామి గౌడ్‌ అన్నారు. సభలో స్వామి గౌడ్‌ హాజరైనారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ విముక్తి కోసం కెసిఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడంతో కేంద్రం దిగివచ్చి గత డిసెంబర్‌ 9న అనుకల ప్రకటన చేయడంతో తెలంగాణ ప్రజల్లో అమృతం కురిసిందని, అమృతం కొద్దిరోజులకే విషం చిమ్మిందని సీమాంధ్రులు కుట్రలను ప్రస్తావిస్తూ ఆవేశపూరితంగా ప్రసంగించారు.