Monday, March 14, 2011

రాష్ట్రం తాకట్టు ?

Takattuపరిశ్రమలు, సెజ్‌లు, ఓడ రేవులు, థర్మల్‌ ప్రాజెక్టుల పేరుతో పేద రైతులు, దళితలకు చెందిన లక్షలాది ఎకరాల భూము లను సర్కారు ప్రైవేట్‌కు ధారాదత్తం చేసింది. పచ్చని పంట పొలాలు, దళితులకిచ్చిన అసైన్డ్‌ భూములు, అటవీ భూములు, ఏజెన్సీ ప్రాం తంలోని అడవిబిడ్డల భూములు, తీరప్రాంత మత్య్సకారుల భూముల న్నింటిని పలు ప్రైవేటు సంస్థలకు అప్పగిం చింది. లక్షలాది ఎకరాల భూములను శ్రీకా కుళం నుంచి చిత్తూరు వరకు వ్యూహాత్మకం గానే కాంగ్రెస్‌ సర్కార్‌ పరిశ్రమల పేరుతో తన అనుయాయులైన ప్రైవేట్‌ యజమాను లకు నామమాత్రం ధరలకు దోచిపెటింది.

పేదల ప్రయోజనాలు ఏమాత్రం పట్టకుండా, మానవతాదృక్పథంతో వ్యవహరించకుండా అడుగడుగునా చట్టాలకు, నిబంధనలకు నీళ్ళు వదిలి ప్రైవేటు భూదాహాన్ని తీర్చింది. ఆరేళ్ళుగా సాగు తున్న భూసంతర్పణపై ఎన్ని విమర్శలు చెలరేగినా వాటన్నిం టికి ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. న్యాయవివాదాలు తలెత్తినా పెట్టుబడి వర్గాలకు సర్కారు దాసోహంగా వ్యవహరిస్తున్నారు. గొప్పలకు పోయి అనేక ప్రాజెక్టులకు భూములు కేటాయించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయనే భ్రమలు కల్పించిన ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట సామాన్యులను రోడ్డు పాలు చేసింది.

పేదల నుంచి తీసుకున్న భూములకు సైతం సరైన నష్టపరిహారం చెల్లిం చలేదని బాధితులు ఇప్పటికీ నెత్తినోరు బాదుకుంటు న్నారు.పేదలు, రైతుల కుటుంబాలను చిన్నా భిన్నం చేసి.. పచ్చని పొలాలను ప్రత్యేక ఆర్థిక మండళ్ళు(సెజ్‌), పారి శ్రామిక పార్కులకు కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా.. ఉపాధి కల్పించే ప్రాజెక్టు ఏదీ రాకపోవడంతో జనం బిత్తరపోతున్నారు. ఉపాధికి సంబంధించి స్థానిక ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో నిలదీసి ప్రశ్నిస్తున్నా సరైన సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఆరేళ్ళుగా కాంగ్రెస్‌ సర్కార్‌లో కొందరు పెద్దలు చేసిన ఏకపక్ష నిర్ణయాలకు తమను బాధ్యులను చేయడంపై స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా మండిపడుతున్నారు.

సర్కారుకు వాన్‌పిక్‌ గండం

తాజాగా స్థానిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ఓడ రేవులు, సెజ్‌లకు కేటాయించిన భూములు, విద్యుత్‌ థర్మల్‌ ప్రాజెక్టులకు కేటాయించిన భూమల వ్యవహారంపై అసెంబ్లీ, శాసన మండలి అట్టుడికిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్‌కు కేటాయించిన భూములపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అసెంబ్లీలోనే ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. వాన్‌పిక్‌ దోపిడికి వ్యతి రేకంగా ఆయన సభలో ఆడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి సైతం సంతృప్తికరంగా సమాధానం ఇవ్వ లేక నీళ్లు నమలడం తప్ప మరోదారి లేకుండాపోయింది.

చివరికి సభలో దీనిపై సీఎం స్పందిం చాల్సి వచ్చింది. పరిస్థితుల తీవ్రతను ఇప్పటికే గమనిస్తున్న సీఎం రాష్ట్రంలో సెజ్‌లు, ఇతర పరి శ్రమలకు కేటాయించిన భూములతోపాటు.. ఓడరేవులకు కేటాయించిన భూములనూ పునః సమీక్షిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ భూసేకరణతో దెబ్బతిన్న నిర్వాసితులను సముచిత రీతిలో ఆదుకుంటామని కూడా చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పరిశ్రమలు, సెజ్‌లు పేరుతో సాగిన భూ కేటాయింపులపై నిజాలు నిగ్గు తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తామని సీఎం తెలిపారు. ఆరేళ్ళ పాలనలో భూ కేటాయిం పులపై సీఎం స్పందనను కొన్ని రాజకీయపార్టీలు స్వాగతిం చాయి.

అసైన్డ్‌ భూములుసైతం ...
దళితులకు, భూములేని పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూములను కూడా ప్రభుత్వం పరిశ్రమల పేరుతో పారిశ్రామిక వేత్తలకు అప్పగించింది. రాష్ర్టంలోని సెజ్‌లు, ఓడరేవుల కోసం వేలాది అసైన్డ్‌ భూములను ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా గుంజుకున్నది. తీరా.. బాధిత పేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... అసైన్డ్‌ భూములపై హక్కులు ప్రభుత్వా నికే ఉంటాయని, ఎవరికైనా అసైన్డ్‌ భూములను కేటాయిస్తే అది వారికి ఉపాధి కల్పించేందుకు మాత్రమే తప్ప, వారికి హక్కులుకల్పించినట్లు కాదని సర్కారు వాదిస్తున్నది.

అసైన్డ్‌ భూములను గతంలో ప్రభుత్వమే దళితులకు, భూమిలేని పేదలకు ఇచ్చింది. ప్రస్తుతం అవసరం వచ్చింది కాబట్టి ప్రభుత్వమే వాటిని వెనక్కి తీసుకుంటుం దని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదు పాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) అధినేతగా పనిచేసిన ఓ ఉన్నతాధికారి బాధిత నిరాశ్ర యులతో చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కేవలం కాకినాడ సెజ్‌ పరిధిలో పరిశ్రమల పేరుతో అధికారికంగా 12 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో అసైన్డ్‌ భూములే 2,500 ఎకరాలు ఉండడం విశేషం. అంతేకాకుండా కాకినాడ సెజ్‌ యాజ మాన్యం స్థానికంగా ఉద్రికత్త పరిస్థితులు సృష్టించి.. పేద రైతులకు చెందిన పచ్చని పొలాలనుసైతం కారుచౌకగా తీసుకుందన్న విమర్శలు లేకపోలేదు. కాకినాడ సెజ్‌ భూములపై ఇప్పటికే పెద్ద ఎత్తున న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి.

అదే విధంగా చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌ కూడా పది వేల ఎకరాల వరకు పేదల నుంచి సేకరించింది. ఇక్కడ కూడా పేదల ఆధీ నంలో ఉన్న అసైన్డ్‌ భూములు పరిశ్రమల పేరుతో బలవతంగా లాక్కున్నట్లు విమర్శలు న్నాయి. ఇప్పటికే శ్రీసిటీ భూసేకరణపై కోర్టులలో ప్రైవేట్‌ కేసులు నడస్తున్నాయి. అంతే కాకుండా అత్యంత కీలకమైన తీర ప్రాంత భూములను కూడా చౌకగా కృష్ణపట్నం, వాన్‌పిక్‌ ఓడరేవు సంస్థ లకు ప్రభుత్వం ధారాదత్తం చేసింది. దీనిపై తీర ప్రాంత పేదలు, మత్స్యకారులు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వ తీరులో ఏ మాత్రం చలనం లేకపోవడం విశేషం. తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి వీటిపై పునఃసమీక్షిస్తానని పైకి చెబు తున్నప్పటికీ.. బాధిత ప్రజానీకానికి సీఎం మాటలు అంతగా నమ్మకం కలిగించడం లేదు.

అందరి దృష్టి ఆ రెండింటిపైనే
ఇప్పటి వరకు ఎమ్మార్‌ , రహేజా అక్రమాల్లో సీఎం వ్యవహారిస్తున్న తీరుపై సొంత క్యాబినేట్‌ మంత్రులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఆర్థిక ప్రయోజనాలనే నిలువునా తాకట్టుపెట్టిన ఎమ్మార్‌, రహేజాల వ్యవహారంలో ఇప్పటిదాకా జరగాల్సిన రాద్దాంతం జరిగింది, ఇకపై చాలు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవ హరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఆ రెండింటి విష యంలో నిగ్గుతేల్చి మిగతా వాటిపై చర్యలకు ఉపక్ర మించాలని సొంత పార్టీ నేతలు సవాల్‌ విసురు తున్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం సమీపంలో లేపాక్షీ హబ్‌ పేరుతో రాయలసీమకు చెందిన మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడికి వేల ఎకరాలను కట్టబెట్టింది.

లేపాక్షి హబ్‌ భూ కేటాయింపులన్నీ అప్పట్లో వ్యూహాత్మకంగా జరగ డం, ఈ కేటాయింపులపై నాడు ఎవ్వరూ నోరు మెదపని పరిస్థితి నెలకొని ఉండడంతో ప్రస్తుతం ఈ కేటాయింపుల లోగుట్టులన్నీ బహిర్గతం అవుతున్నాయి. సర్కారు పెద్దలు అనంతపురం జిల్లాలో సదరు సంస్థకు వేలాది ఎకరాలు నామ మాత్రపు రేటు సమర్పించారు. తాజాగా అక్కడ ప్రభుత్వ భూములు లేకపోవడంతో... లేపాక్షి హబ్‌కు కేటాయించిన భూముల్లోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిడిఎల్‌ మిసైల్‌ ప్రాజెక్టు రూ. 750 కోట్లతో చేపడుతుంది.

ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం బిడిఎస్‌ సంస్థ కనీసం 600 ఎకరాలు అవ సరమని కోరుతున్నది. అదే విధంగా ఇసిఐఎల్‌, బిహెచ్‌ఇఎల్‌ సంయుక్తంగా సుమారు 700 ఎకరాల్లో రూ. 500 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థ ప్రఖ్యాత సైన్స్‌ పార్కును అనంతపురం లేపాక్షి హబ్‌లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తో న్నది. దీనికోసం వెయ్యి ఎకరాలు కావాలని కోరుతున్నది. అదే విధంగా అమిత్ర యూనివర్సిటీ రూ. 150 కోట్ల ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం 150 ఎకరాలు కోరుతున్నది. ఈరకంగా ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున లేపాక్షీ హబ్‌లో వేలాది ఎకరాల భూములను కోరడం విశేషం.

భూముల జాతీయకరణ
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఐఐసీ ద్వారా భూములు సేకరించి.. తదుపరి పియస్‌యూ, ఇతర సంస్థలకు భూములు కేటాయిస్తే.. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుపడుతోంది. తాజాగా రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లోని భూము లను పరిశ్రమలు, సెజ్‌లు, ఓడరేవుల పేరుతో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించి ఆ తర్వాత ప్రభుత్వ పరం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాల రీత్యా ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసినట్లుగానే దేశంలో, రాష్ట్రంలోని ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కులు,సెజ్‌ భూములను జాతీయం చేసే పరిస్థితి లేకపోలేదం టున్నారు. అది కూడా ఎంతోదూరంలో లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ మంత్రి ఒకరు ఘాటుగా స్పందించారు. కోస్తా తీరప్రాంత భద్రతపై ఇప్పటికే ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియ చేశామని, రాష్ర్ట ప్రభుత్వం దీనిపై తీవ్రంగా దృష్టిసారించక పోతే కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని సదరు మంత్రి స్పష్టం చేశారు.

భూములు అడుక్కుంటున్న పీఎస్‌యూలు

వ్యూహాత్మకంగా పలు జిల్లాల్లో విలువైన భూములను ప్రయివేటు గద్దలకు సర్కారు పెద్దలు దారాదత్తం చేయడంతో తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ(పియస్‌యు)ల అవస రాలకు ప్రయివేటు సంస్థల నుంచి భూములు కోరాల్సిన దుస్థితి నెలకొంది. అంటే సర్కారు వద్ద ఉండాల్సిన ల్యాండ్‌ బ్యాంక్‌ను సైతం ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టి ప్రభుత్వం జీరో ల్యాండ్‌ బ్యాంక్‌ స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు పిఎస్‌యు భూముల కోసం ప్రభుత్వమే ప్రైవేటు సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపరడాల్సి రావడం విశేషం. మౌలిక సదుపాయాలు ఇతరత్రా అభివృద్ధికే పెద్ద ఎత్తున ప్రైవేట్‌ సెజ్‌లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం పైకి చెబుతున్నప్పటికీ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వేల ఎకరాలు వారుతన్నుకుపోతున్న విషయం మాత్రం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మరుగున పెడుతున్నది.